🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 30 July 2026, 05:46 PM Posted by: MANA VISHWAM

100 రోజుల్లో రూ.6 వేల కోట్ల బకాయిల చెల్లింపు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం గడువులోపే అమలు చేసింది. 100 రోజుల్లో రూ.6 వేల కోట్ల బకాయిలను చెల్లిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, గురువారం మూడో విడతగా మరో రూ.2 వేల కోట్లను విడుదల చేయడంతో మొత్తం చెల్లింపులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 29న తొలి విడతగా రూ.2 వేల కోట్లు, జూన్ 30న రెండో విడతగా మరో రూ.2 వేల కోట్లు విడుదల చేసింది. తాజాగా మూడో విడతగా మరో రూ.2 వేల కోట్లు విడుదల చేయడంతో 100 రోజుల లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.


కమ్యూటేషన్ బకాయిలకు పూర్తి పరిష్కారం

తాజాగా విడుదల చేసిన నిధులతో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలను పూర్తిగా చెల్లించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ సమస్యకు పరిష్కారం లభించడంతో విశ్రాంత ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మిగిలి ఉన్న ఇతర బకాయిలను కూడా దశలవారీగా విడుదల చేసి పూర్తిగా చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఉద్యోగుల్లో హర్షం

బకాయిల విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షనర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల మధ్య కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిర్ణీత గడువులో అమలు చేయడం అభినందనీయమని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఉద్యోగుల సంక్షేమానికి ఇదే విధమైన సానుకూల నిర్ణయాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వం–ఉద్యోగ సంఘాల మధ్య పరస్పర విశ్వాసం మరింత బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డారు.
🏠 Home