🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 29 July 2026, 03:25 PM Posted by: MANA VISHWAM

తెలంగాణ నయాగరా ఉగ్రరూపం!

ములుగు జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం, తెలంగాణ నయాగరా గా పేరొందిన బొగత జలపాతం భారీ వరదతో ఉగ్రరూపం దాల్చింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో జలపాతానికి భారీగా వరద చేరడంతో నిండుకుండలా మారింది. ఉప్పొంగి ప్రవహిస్తున్న జలధార పర్యాటకులను అబ్బురపరుస్తున్నప్పటికీ, ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.
సుమారు 160మీటర్ల వెడల్పున, 50అడుగుల ఎత్తు నుంచి భారీ నీటి ప్రవాహం ఉరకలెత్తుతూ కిందకు దూసుకెళ్తోంది. జలపాతం ఉధృతికి పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన రక్షణ వలయం కారిడార్ పూర్తిగా నీట మునిగింది. దీంతో ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు చేపట్టారు.
భద్రాచలం–ఏటూరునాగారం అటవీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భోగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే సందర్శకులకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.
అధికారులు, పోలీసులు జలపాతం పరిసరాల్లో అప్రమత్తంగా ఉండి, ఎవరూ వరద నీటిలోకి దిగకుండా పర్యవేక్షిస్తున్నారు. స్థానికులు, పర్యాటకులు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
🏠 Home