🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 08 July 2026, 10:41 PM Posted by: MANA VISHWAM

తెలంగాణ వరి కొనుగోళ్లు పెంచండి: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కిషన్ రెడ్డి వినతి

తెలంగాణలో రబీ (2025-26) సీజన్‌కు సంబంధించి వరి కొనుగోలు పరిమాణాన్ని పెంచడంతో పాటు, రాష్ట్రం నుండి అదనపు బియ్యం సేకరణకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఢిల్లీలో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులతో కలిసి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర రైతాంగ సమస్యలపై ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.
​ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రబీ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేకరించేలా చూడాలన్నారు. అన్నదాతల శ్రమకు తగిన గిట్టుబాటు ధర లభించేలా కొనుగోలు వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి అవసరమైన మేర అదనపు బియ్యం సేకరణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వ్యవసాయ రంగం బలోపేతానికి, రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, భవిష్యత్తులోనూ అన్నదాతల ప్రయోజనాల పరిరక్షణకు బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ ప్రజాప్రతినిధులు రైతుల సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సానుకూలంగా స్పందించారు.
🏠 Home