🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 05 June 2026, 12:42 PM Posted by: MANA VISHWAM

ఈవీలు సరే.. మరి చార్జింగ్‌ ఎట్ల?

హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వ్యయాలు తగ్గించాలంటే ఎలక్ట్రికల్‌ వాహనాల వాడకం తప్పనిసరి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుతో టూ, త్రీ, ఫోర్‌ వీలర్స్‌ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆయా షోరూమ్స్‌కు క్యూ కడుతున్నారు. కానీ ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో ఎక్కడా చార్జింగ్‌ స్టేషన్లు కన్పించకపోవడంతో ఆలోచనలో పడ్డారు. దీంతో ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీలు ప్రకటించినా ఈవీల కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఉన్నా చార్జింగ్‌ గురించి ఆలోచిస్తూ వెనకడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో ఈవీలు కొనుగోలు చేసే వారికి రోడ్డు ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు ఉంది.
కూకట్‌పల్లిలో ఇదీ పరిస్థితి..మినీ ఇండియాగా పేరుగాంచిన కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఎలక్ర్టికల్‌ వాహనాలను కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కానీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. గత ఏడాదిగా కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌, వివేకానందనగర్‌ కాలనీ ఎదురుగా, ఐడీఎల్‌ ట్యాంక్‌ మార్గంలో ఏర్పాటు చేసిన స్టేషన్లు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. నామ్‌కే వాస్తే ఏర్పాటు చేశారే తప్ప అక్కడ చార్జింగ్‌కు అవకాశం కల్పించలేదు. దీంతో అవి ఉన్నా లేనట్టే. కూకట్‌పల్లి ప్రాంతంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు నివాసం ఉంటున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలు కూడా అధికంగానే ఉంటాయి.
🏠 Home